అధికారం మాదే..! తెలంగాణలో పొలిటికల్ జ్యోతిష్యం

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే రాష్ట్రంలో మళ్లీ అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌ రావు రాష్ట్రంలో ఎక్కడా పర్యటించినా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చేది ఖాయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కంచ గచ్చిభూముల విషయంలో సీఎం రేవంత్ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన కేటీఆర్.. ఆ భూములను ఎవరూ కొనద్దని.. మూడేళ్లలో బీఆర్ఎస్‌ అధికారంలోకి రాగానే ఆ భూములను తిరిగి తీసుకుని అతిపెద్ద ఎకోపార్క్‌ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

సీఎం రేవంత్ పాలనతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందంటున్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో.. అంతే స్పీడ్‌గా గ్రౌండ్లో కుప్పకూలిందంటూ వ్యాఖ్యానించారు. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదని హరీష్‌ రావు సెటైర్లు వేశారు. పొన్నం ప్రభాకర్ కౌంటర్..
తాము అధికారంలోకి వస్తే కంచ గచ్చిబౌలి భూములు తిరిగి తీసేసుకుంటామన్న కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని.. జ్యోతిష్యం చెప్పించుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారాన్ని ఎవరికి అప్పగించాలో ప్రజలకు బాగా తెలుసన్నారు. ప్రజల నాడి తెలుసుకోలేని బీఆర్ఎస్ నేతలకు భవిష్యత్తు లేదంటూ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

మొత్తానికి రాష్ట్రంలో అధికారంపై అటు బీఆర్ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ నేతల పొలిటికల్ జోస్యాలు ఆసక్తి రేపుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *