పెళ్లి కావడంలేదని సికింద్రాబాద్ లో యువ వైద్యుడి బలవన్మరణం

V. Sai Krishna Reddy
1 Min Read

వయసు మీద పడుతున్నా వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్ లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌ కు చెందిన ప్రకాష్‌ మాల్‌ కుటుంబంతో సహా సికింద్రాబాద్ లో స్థిరపడ్డారు. ఆయన చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ఓ బస్తీ దవాఖానాలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. పురోహిత్ కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు.

అయితే, పురోహిత్ కు బట్టతల ఉండటం, ఇతర కారణాల వల్ల అమ్మాయి కుటుంబం ఈ వివాహాన్ని రద్దు చేసుకుంది. దీంతో పురోహిత్ తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతుకుతున్నారు. సరైన సంబంధం దొరకడం లేదు. ఇప్పటికే 34 ఏళ్లు వచ్చాయని, నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రద్దయిందని పురోహిత్ మనస్తాపం చెందాడు. ఈ ఆవేదనతో బుధవారం ఉదయం బొల్లారం రైల్వేస్టేషన్‌ సమీపంలోని క్యావలరీ బ్యారక్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్‌ ఈ విషయాన్ని గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. గుర్తింపు కార్డులోని చిరునామా ఆధారంగా పురోహిత్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *