ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలోని ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారని… తాను వెళ్లి దాన్ని పగలగొట్టానని చెప్పారు. లోకల్ ఎమ్మెల్యే అయిన తనకు చెప్పకుండా శంకుస్థాపన చేశారని మండిపడ్డారు. అందుకే తనకు మరో ఆప్షన్ లేక దాన్ని పగలగొట్టానని అన్నారు. ఇదే స్థలానికి పక్కన ఉన్న కొంత స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం స్థలం ఇవ్వమంటే అధికారులు ఇవ్వలేకపోయారని విమర్శించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వడం లేదని దానం మండిపడ్డారు. తాను అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేనని, తనకు ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
కొత్త భవనాల విషయంలో సోషల్ మీడియాలో చిన్నచిన్న పత్రికలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని… వాటికి జీహెచ్ఎంసీ అధికారులు భయపడిపోతున్నారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించని అధికారులు… సోషల్ మీడియా వాళ్లు ఫోన్ చేస్తే మాత్రం భయపడుతున్నారని అన్నారు. అధికారులు, వాళ్లు కలిసి లావాదేవీలు చేసుకుంటున్నారని… వీటిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పారు.