కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్లోని న్యాయస్థానం రూ.200 జరిమానా విధించింది. ఆయన పదేపదే విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14న తుది విచారణకు హాజరు కావాలని, లేదంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
మూడేళ్ల క్రితం మహారాష్ట్రలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ… వీరసావర్కర్ను అవమానించినట్టు ఆరోపణలు ఎదుర్కొంరటున్నారు. వీరసావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుండి పెన్షన్ కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్ర సమరయోధుడైన వీరసావర్కర్ను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా విధించింది. రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది ప్రన్షు అగర్వాల్ హాజరయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం బిజీగా ఉన్నారని, వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే పదేపదే విచారణకు గైర్హాజరవుతుండటంతో కోర్టు జరిమానా విధించింది.