తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు. ఈరోజు కూడా మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ… గాలి మాటలు మాట్లాడితే కుదరదని చెప్పారు. తప్పు చేసిన వాడిని కూడా క్షమించే గుణం తనదని… తనను తిట్టినా పట్టించుకోనని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని… పాలన చేసే వారు అడిగితేనే తాను సలహాలు ఇస్తానని చెప్పారు. కులగణన అంశంలో తన పాత్ర లేదని తెలిపారు.
మరో సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ… తీన్మార్ మల్లన్న అంశంతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఆ అంశాన్ని పార్టీ నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు చెప్పానని తెలిపారు.