ఏపీ మిర్చి రైతుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ మిర్చి రైతుల అంశంపై మాట్లాడారు.
ఈ నేపథ్యంలో, చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. ఏపీ మిర్చి రైతుల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ఈ మేరకు మిర్చికి ధరను ప్రకటించింది. ఈ ధరను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరించనున్నాయి.
కాగా, ఏపీ నుంచి 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు కేంద్రం అవకాశం కల్పించింది. 2024-25 సీజన్ లో పండిన మిర్చికి వర్తించేలా తాజా ఉత్తర్వులు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలుస్తోంది