పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి, అక్కడ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిర్చికి అధిక ధరను కావాలని అడిగారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి మిర్చి రైతులకు రూ.25 వేలు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంతో కొట్లాడాలని డిమాండ్ చేశారు.
కవిత ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని అన్నారు. మిర్చి పంటకు ఎకరాకు లక్షల్లో ఖర్చవుతోందని ఆమె అన్నారు. మిర్చి, పసుపు రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని సూచించారు. మిర్చి రైతులకు కనీస మద్దతు ధర రాకుంటే వారు తీవ్రంగా నష్టపోతారని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ‘పీపీపీ’ మోడ్లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సంటేజ్ అని చురక అంటించారు.