- వ్యవసాయ అధికారిణి దీపిక
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలని మండల వ్యవసాయ అధికారిణి దీపిక కోరారు. గురువారం నర్సాపూర్ పరిధిలోని హన్మంతాపూర్ గ్రామంలో రైతు సూరారం నర్సింలుకు చెందిన 1.20 ఎకరాల జామ తోటలో అంతర పంటగా ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం భారీగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. 200 విలువైన మొక్కను 20 లకే సబ్సిడీపై అందజేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలపై 100 శాతం, జనరల్ రైతులకు 90 శాతం రాయితీ ఉంటుందని వివరించారు. వీటితో పాటు రైతు భరోసా, అంతర పంటల సాగుకు ఎకరానికి 2,100, ఎరువుల కోసం మరో 2,100 ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో టెక్నికల్ ఏఓ శ్రీదేవి, కంపెనీ ప్రతినిధి అజయ్, రైతులు పాల్గొన్నారు.
