వార్డుల్లో రసవత్తర రాజకీయం!
నర్సాపూర్(ప్రజాజ్యోతి) పట్టణ కేంద్రంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పట్టణంలోని ప్రతి గల్లీలోనూ ఇప్పుడు ఎన్నికల సందడి స్పష్టంగా కనిపిస్తోంది.
- హోరాహోరీగా ‘సౌండ్’ వార్
వార్డుల్లో ప్రచారం కేవలం పాదయాత్రలకే పరిమితం కాకుండా, సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఒక పార్టీని మించి మరొకటి పోటీ పడుతూ తమ పార్టీ సిద్ధాంతాలను, పథకాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక గీతాలతో పట్టణాన్ని హోరెత్తిస్తున్నాయి. డీజే సౌండ్ సిస్టమ్స్ అమర్చిన వాహనాలు వార్డులను చుట్టేస్తున్నాయి. రంగురంగుల ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో అలంకరించిన వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక పార్టీ పాట వినిపిస్తే, దానికి ధీటుగా మరో పార్టీ కార్యకర్తలు తమ పాటలతో పలకరిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
- గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆగకుండా సాగుతున్న ఈ ప్రచార పర్వంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు శ్రమిస్తున్నారు. పార్టీల జెండాలు, తోరణాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ‘సంగీత యుద్ధం’ రేపటితో ముగియనున్నందున నర్సాపూర్ వాసుల్లో ఎన్నికల ఆసక్తి మరింత పెరిగింది.
