చేర్యాల మున్సిపల్ ‘ పోరు ‘… చైర్మన్ పీఠం దక్కేదెవరికో?
చేర్యాల ఫిబ్రవరి 04(ప్రజాజ్యోతి): చేర్యాల మున్సిపాలిటీలోనీ 12 వార్డుల్లోనూ రసవత్తర పోటీ నెలకొంది. మున్సిపాలిటీలోని 12 వార్డులకు గానూ మొత్తంగా మూడు ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లతో కలిపి 55 మంది ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేశారు.కాగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల నుండి ఒక్కో వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసినప్పటీకీ పార్టీ అధినాయకత్వం బుజ్జగింపులు చేసి నచ్చచెప్పడం, భవిష్యత్తులో సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆశావాహులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు.నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 12 మంది, బీఆర్ఎస్ పార్టీ 11 మంది, బీజేపీ 12 మంది, సీపీఎం 01, సీపీఐ 01, ఏఐఎఫ్బీ 01, బీఎస్పీ 01, ఇండిపెండెంట్లు 5 గురు మొత్తంగా 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.ఇరు పార్టీలకు ఈ ఎన్నిక కీలకం కావడంతో ఇరుపార్టీల నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు చేర్యాల మున్సిపాలిటీనీ చేజిక్కించుకొని తమ సత్తా చాటాలని తమదైన శైలిలో ప్రచారాలకు సిద్ధమవుతున్నారు.
