మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘ఏకగ్రీవ’ బోణీ.. మూడు చోట్ల హస్తం హవా

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ, అధికార కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన ఖాతాను తెరిచింది. రాష్ట్రంలోని మూడు కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది. మెదక్ మున్సిపాలిటీతో పాటు రామగుండం, పాలమూరు (మహబూబ్‌నగర్) కార్పొరేషన్లలో కాంగ్రెస్ బోణీ కొట్టింది.

మెదక్ మున్సిపాలిటీలోని 32వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గోదల మానస సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. విశేషమేమిటంటే, ఆమె గత ఎన్నికల్లోనూ ఇదే వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా రెండుసార్లు ఇలా ఎన్నిక కావడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థులుగా ఉన్న అత్త లక్ష్మి, బీఆర్ఎస్ అభ్యర్థి జ్యోతి తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మానస విజయం ఖాయమైంది.

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ 1వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, ఇక్కడ రాజకీయ రచ్చ మొదలైంది. కాంగ్రెస్ నాయకులు తమను బెదిరించి నామినేషన్లు విత్ డ్రా చేయించారని బీజేపీ అభ్యర్థి రీమా బిశ్వాస్ ఆరోపించారు. తన భర్తపై తప్పుడు కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని ఆమె అదనపు డీసీపీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ 58వ డివిజన్ (రాజేంద్రనగర్) నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి ఎన్నిక లాంఛనమైంది. బీజేపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఇక్కడ కూడా హస్తం పార్టీ జెండా ఎగిరింది.

తెలంగాణవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో నేడు (ఫిబ్రవరి 3) నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. సాయంత్రం కల్లా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఏకగ్రీవాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *