పరిగి మల్లెమోనిగూడలో ఘోర అగ్నిప్రమాదం – మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధం
పరిగి, జనవరి 21 (ప్రజాజ్యోతి):
పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు నాలుగున్నర ప్రాంతంలో ఒక ఇంట్లో విద్యుత్ తీగలకు షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించి పక్కనున్న రెండు ఇళ్లకూ అంటుకోవడంతో మొత్తం మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే మంటలు విస్తరించడంతో ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రెండు మేకలు, తొమ్మిది బియ్యం బస్తాలు, కూలర్, వాషింగ్ మెషీన్, ఇంటి పత్రాలు, అల్మారాలు, బట్టలు, సీలింగ్ ఫ్యాన్లు, పెట్రోల్ స్ప్రేయర్ తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.
ఈ అగ్నిప్రమాదంలో నష్టపోయిన వారు ఎం.డి. రసూల్ బీ, ఎం.డి. భాషీర్ బీ, ఎండి మౌలానా గా తెలిసింది. ఈ ప్రమాదంతో సుమారు రూ. 9,50,000 విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు, స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
