ఏపీలో కొండెక్కిన కోడి.. ఆకాశాన్నంటిన ధర

V. Sai Krishna Reddy
1 Min Read

ఏపీలో కోడి మాంసం ధర కొండెక్కింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే వినియోగదారులకు షాకిస్తూ చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. గత మూడు నెలలుగా స్థిరంగా ఉన్న ధరలు, కేవలం రెండు వారాల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. గతంలో కిలో రూ. 260 వద్ద ఉన్న బ్రాయిలర్ చికెన్ ధర, ఇప్పుడు ఏకంగా రూ. 300 మార్కును తాకింది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు చికెన్ కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ. 300 పలుకుతుండగా, లైవ్ కోడి ధర రూ. 170కి చేరింది. ఫారం కోడి మాంసం కిలో రూ. 180, బండ కోడి మాంసం రూ. 280గా అమ్ముతున్నారు. రానున్న సంక్రాంతి పండుగ డిమాండ్, కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఫారాల్లో దాణా, రవాణా ఖర్చులు పెరగడం, ఇటీవల కోళ్లకు వ్యాధులు సోకడంతో రైతులు ఉత్పత్తిని తగ్గించడం కూడా ధరల పెరుగుదలకు దారితీసిందని చెబుతున్నారు.

గతేడాది బర్డ్ ఫ్లూ భయాలతో చికెన్ ధరలు పతనమైన సంగతి తెలిసిందే. అప్పుడు గరిష్ఠంగా కిలో ధర రూ. 285 దాటలేదు. కానీ, డిసెంబర్ చివరి వారం నుంచి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్ 21న కిలో రూ. 240గా ఉన్న ధర, ఇప్పుడు రూ. 300కు చేరడం వినియోగదారుల జేబులకు భారంగా మారింది.

మరోవైపు, కోడిగుడ్డు ధర కూడా గత కొన్ని వారాలుగా రూ. 8.5 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. సంక్రాంతి వరకు చికెన్, గుడ్ల ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలతో చాలామంది చికెన్‌కు బదులుగా చేపలు వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *