బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ ప్రభంజనం: రూ.1200 కోట్ల క్లబ్‌లో చేరిక.. కేజీఎఫ్-2 రికార్డు బద్ధలు

V. Sai Krishna Reddy
1 Min Read

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 31వ రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్ల మైలురాయిని అధిగమించింది. భారతీయ సినిమా చరిత్రలో ఈ ఘనత సాధించిన 5వ చిత్రంగా ఇది నిలిచింది. ఈ క్రమంలో కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సాధించిన రూ.1,200 కోట్ల లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించి, 5వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ (రూ.1230 కోట్లు) రికార్డు దిశగా దూసుకుపోతోంది.

ఐదో వీకెండ్‌లోనూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిరూపించుకుంది. మూడు రోజుల్లో రూ.33 కోట్లు వసూలు చేయడంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 772.25 కోట్లకు (గ్రాస్ రూ.926.7 కోట్లు) చేరాయి. హాలీవుడ్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ వంటి భారీ సినిమాల నుంచి పోటీ ఎదురైనప్పటికీ ధురంధర్ నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవడం విశేషం.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ చిత్రం ఇప్పటివరకు 31 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. మధ్యప్రాచ్య దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించకపోయి ఉంటే, మరో 10 మిలియన్ డాలర్లు అదనంగా వచ్చి ఉండేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అడ్డంకులను అధిగమించి మరీ ధురంధర్ టాప్-10 భారతీయ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది.

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆయన హంజా అనే ఇండియన్ ఏజెంట్‌గా కనిపిస్తారు. కరాచీలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతం చేసే మిషన్‌లో భాగంగా సాగే ఈ కథలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సీక్వెల్ (పార్ట్-2)ను ఈ ఏడాది మార్చిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *