తెలంగాణను వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ చలి గుప్పిట్లో చిక్కుకుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రికార్డు స్థాయిలో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, చలి తీవ్రతకు తట్టుకోలేక మెదక్‌లో ఓ యాచకుడు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ఈ నెల‌ 5 నుంచి వరుసగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. బుధవారం ఇక్కడ 6.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే తరహాలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ చలిగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పగలు ఎండ ఉన్నప్పటికీ, సాయంత్రం నుంచే చల్లటి గాలులతో వాతావరణం మారిపోతోంది.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. బయటకు వెళ్లేటప్పుడు ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, చేతి గ్లౌజులు ధరించాలని, ఒకే మందపాటి దుస్తువుకు బదులు రెండు మూడు పొరలుగా దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు, వేడి ఆహారం తీసుకుంటూ శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని, శ్వాసకోశ సమస్యలున్నవారు ఉదయం పూట బయటకు రాకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *