కేటీఆర్ టూర్లు అసమర్థుడి జీవయాత్రలా ఉన్నాయి: ప్రభుత్వ విప్ ఫైర్

V. Sai Krishna Reddy
1 Min Read

సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయినా.. మాజీ మంత్రి కేటీఆర్ విజయోత్సవ సభలు నిర్వహించడం చూస్తుంటే జాలేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పర్యటనలు “అసమర్థుడి జీవయాత్ర”లా ఉన్నాయని, ఓడిపోయిన సర్పంచ్‌లను ఓదార్చడానికి ఓదార్పు యాత్రలు చేస్తున్నారా అని సెటైర్లు వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, 53 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారని బీర్ల ఐలయ్య తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కేవలం 33 శాతం స్థానాలకే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో 60 శాతం స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుందని ఆయన వివరించారు. పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇలాంటి సభలు పెట్టడం చూస్తే కేటీఆర్ మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాము బెదిరిస్తే బీఆర్ఎస్ నుంచి వేల మంది సర్పంచ్‌లు ఎలా గెలిచారని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్షాల నుంచి గెలిచిన వారిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుందని ఆరోపించారు.

కవిత దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ కూలిపోతోందని, హరీశ్ రావు వంటి నేతలు పార్టీకి గుండు కొట్టే పనిలో ఉన్నారని బీర్ల ఐలయ్య విమర్శించారు. బీఆర్ఎస్ పని ఖతమైందని, రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 శాతం సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే కేటీఆర్ నాలుక కోస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *