రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్కు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగారు.
తన పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ తొలుత రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కూడా పలు నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
అనంతరం రాజమహేంద్రవరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రి లోకేశ్ పాల్గొంటారు. ముందుగా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన ఉత్తమ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.
