తెలంగాణ పల్లె పోరులో కాంగ్రెస్ జయభేరి

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 2,383 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎన్నికలు జరగ్గా, సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు.

ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 1,146 పంచాయతీలను గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రమే బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకోగలిగింది. ఇక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభావం నామమాత్రంగానే ఉండి, 200 లోపు స్థానాలకే పరిమితమైంది. స్వతంత్రులు, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులు కలిపి సుమారు 455 చోట్ల విజయం సాధించారు.

నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 84.28 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88 శాతం, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, పలుచోట్ల అభ్యర్థుల మధ్య గట్టిపోటీ నెలకొనడంతో అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *