తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన శనివారం సాయంత్రం కరూర్ పట్టణంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే… టీవీకే పార్టీ తరఫున విజయ్ రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా కరూర్ లో ఏర్పాటు చేసిన సభకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విజయ్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలోని ఇరుకైన ప్రాంతంలో ఒక్కసారిగా జనం ముందుకు తోసుకురావడంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ క్రమంలో జనం ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక, కిందపడి నలిగిపోయి 36 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు చిన్నారులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు.
మాటలకు అందని, వర్ణించలేని బాధ: విజయ్
ఈ ఘటనపై నటుడు విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. “నా గుండె పగిలిపోయింది. మాటలకు అందని, వర్ణించలేని బాధతో కుమిలిపోతున్నాను. కరూర్ లో ప్రాణాలు కోల్పోయిన నా సోదర సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయడానికి న్యాయ విచారణకు ఆదేశించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ నాయకులు ఈ విషాదం పట్ల సంతాపం ప్రకటించారు.
