వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్థానికత నిబంధనపై తెలంగాణ సర్కార్ కీలక సవరణ

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానికతను నిర్ధారించే జీవో నంబర్ 33కు సవరణలు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల వల్ల బదిలీలపై ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు భారీ ఊరట లభించనుంది.

కొత్తగా సవరించిన జీవో ప్రకారం నాలుగు కేటగిరీల విద్యార్థులకు స్థానికత విషయంలో మినహాయింపు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆల్ ఇండియా సర్వీసెస్ (తెలంగాణ కేడర్), ఆర్మీ, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీల ఉద్యోగుల పిల్లలు.. తమ తల్లిదండ్రుల ఉద్యోగ బదిలీల కారణంగా రాష్ట్రం వెలుపల చదవాల్సి వచ్చినా, వారిని స్థానికులుగానే పరిగణించనున్నారు. వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదవకపోయినా, తల్లిదండ్రుల ఉద్యోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఈ నాలుగు కేటగిరీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రత్యేక అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు వారు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి, ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితాను విడుదల చేస్తామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి తెలిపారు.

ఈ సవరణల కారణంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌ను ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. మొత్తం నాలుగు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కలిపి 8,515 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 4,090 సీట్లు ఉండగా, 613 సీట్లు అఖిల భారత కోటాకు కేటాయించారు. మిగిలిన సీట్లకు యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *