ఎర్రకోటలో భారీ చోరీ… భక్తుడి వేషంలో రూ.1.5 కోట్లు కొట్టేసిన దొంగ అరెస్ట్

V. Sai Krishna Reddy
1 Min Read

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన జైన మతపరమైన కార్యక్రమంలో భక్తుడి వేషంలో పాల్గొని సుమారు రూ.1.5 కోట్ల విలువైన బంగారు వస్తువులను అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు భూషణ్ వర్మను ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సోమవారం పోలీసులు వెల్లడించారు. ఈ భారీ చోరీ కేసును సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.

ఆగస్టు 28 నుంచి ఎర్రకోట ప్రాంగణంలోని ఆగస్టు 15 పార్కులో జైనుల పవిత్ర పండుగ ‘దశలక్షణ మహాపర్వ’ జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 3న భూషణ్ వర్మ భక్తుడి మాదిరిగా పంచెకట్టు ధరించి కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని పూజల కోసం ఉంచిన విలువైన వస్తువులను దొంగిలించాడు.

సుమారు 760 గ్రాముల బరువున్న బంగారు ‘ఝరీ’ (కలశం), బంగారు కొబ్బరికాయతో పాటు వజ్రాలు, కెంపులు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో బంగారు కలశాన్ని నిందితుడు అపహరించినట్టు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. ఈ వస్తువులు జైన సంప్రదాయ పూజల్లో ఎంతో కీలకమైనవి. నిందితుడు భూషణ్ వర్మ జైన మతస్థుడు కాదని, అతడిపై గతంలోనూ అనేక పోలీసు కేసులు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

చోరీకి గురైన ఈ విలువైన వస్తువులు వ్యాపారవేత్త సుధీర్ జైన్‌కు చెందినవి. ఆయన ప్రతిరోజూ పూజా కార్యక్రమాల కోసం వాటిని తీసుకువచ్చేవారు. ఈ ఘటనపై సుధీర్ జైన్ మాట్లాడుతూ “రద్దీని వాడుకుని దొంగ ఈ పని చేశాడు. ఆ వస్తువులకున్న విలువ కంటే వాటితో మాకున్న అనుబంధం, మా మనోభావాలు ఎంతో గొప్పవి. వాటికి వెలకట్టలేం” అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడిని విచారిస్తూ దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *