మహీంద్రా, టయోటా కార్లపై రూ.1.56 లక్షల వరకు తగ్గింపు

V. Sai Krishna Reddy
2 Min Read

పండగ సీజన్‌కు ముందు వాహనదారులకు తీపికబురు
జీఎస్టీ 2.0 ప్రయోజనాలతో ధరలు తగ్గించిన ఆటోమొబైల్ కంపెనీలు
మహీంద్రా కార్లపై రూ.1.56 లక్షల వరకు తగ్గింపు ప్రకటన
టయోటా వాహనాలపై గరిష్ఠంగా రూ.3.49 లక్షల వరకు ధరల కోత
రెనాల్ట్ ఇండియా కూడా తన కార్ల ధరలను రూ.96,395 వరకు తగ్గించింది
తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త ధరలు
పండగ సీజన్ సమీపిస్తున్న వేళ కొత్త కారు కొనాలనుకునే వారికి ఆటోమొబైల్ కంపెనీలు శుభవార్తను అందించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ 2.0 విధానం ద్వారా కలిగిన ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్, రెనాల్ట్ వంటి ప్రముఖ సంస్థలు తమ కార్ల ధరలను భారీగా తగ్గించాయి. ఈ నూతన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయా కంపెనీలు శనివారం ప్రకటించాయి.

దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఐసీఈ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోపై రూ.1.56 లక్షల వరకు ధరలను తగ్గించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్ఓ డీజిల్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.1.56 లక్షల తగ్గింపు లభించనుండగా, పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.40 లక్షల వరకు ధర తగ్గింది. స్కార్పియో-ఎన్ మోడల్‌పై రూ.1.45 లక్షలు, ఎక్స్‌యూవీ700పై రూ.1.43 లక్షలు, థార్‌పై రూ.1.33 లక్షలు, బొలెరో, బొలెరో నియోపై రూ.1.27 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చని కంపెనీ తెలిపింది.

మరోవైపు, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తన వాహనాలపై గరిష్ఠంగా రూ.3.49 లక్షల వరకు ధరల కోత విధించింది. టయోటా ఫార్చ్యూనర్ మోడల్‌పై అత్యధికంగా రూ.3.49 లక్షల తగ్గింపు లభించనుండగా, గ్లాంజాపై రూ.85,300, టైసోర్‌పై రూ.1,11,100, హైరైడర్‌పై రూ.65,400 వరకు ధరలు తగ్గాయి. రెనాల్ట్ ఇండియా కూడా క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి మోడళ్లపై రూ.96,395 వరకు ధరలను తగ్గించింది.

ఈ చారిత్రాత్మక సంస్కరణ కోసం భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని టయోటా సేల్స్-సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా అన్నారు. “ఈ నిర్ణయం కస్టమర్లకు వాహనాలను మరింత అందుబాటులోకి తేవడమే కాకుండా, ఆటో రంగానికి విశ్వాసాన్ని పెంచింది. పండగ సీజన్ ముందు అమ్మకాలకు ఇది మంచి ఊపునిస్తుందని ఆశిస్తున్నాం” అని ఆయన వివరించారు.

నూతన జీఎస్టీ 2.0 విధానం ప్రకారం, ఇకపై పెట్రోల్, డీజిల్ (ఐసీఈ) కార్లపై 18 శాతం లేదా 40 శాతం పన్ను వర్తిస్తుంది. గతంలో ఈ వాహనాలపై 28 శాతం జీఎస్టీతో పాటు ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి 1 నుంచి 22 శాతం వరకు అదనపు సెస్సు ఉండేది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 5 శాతంగానే కొనసాగనుండగా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *