సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు రెండున్నర నుంచి మూడున్నర కిలోల మధ్య ఉంటుంది. కానీ, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ బాలుడు ఏకంగా 5.2 కిలోల బరువుతో పుట్టి వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ అరుదైన ఘటన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జబల్పూర్కు చెందిన శుభాంగి అనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం చేయగా, పండంటి మగబిడ్డ జన్మించాడు. అనంతరం శిశువు బరువును తూకం వేయగా, ఏకంగా 5.2 కిలోలు ఉండటంతో ఆపరేషన్ చేసిన వైద్యులు, సిబ్బంది అబ్బురపడ్డారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఈ ప్రసవం చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ భావనా మిశ్రా మాట్లాడుతూ, “ఇంత ఎక్కువ బరువుతో శిశువు జన్మించడం చాలా అరుదైన విషయం. నా వైద్య వృత్తిలో ఇంత బరువున్న నవజాత శిశువును చూడటం ఇదే మొదటిసారి” అని తెలిపారు. సాధారణంగా పుట్టినప్పుడు మగ శిశువులు 2.8 నుంచి 3.2 కిలోల వరకు, ఆడ శిశువులు 2.7 నుంచి 3.1 కిలోల వరకు బరువు ఉంటారని ఆమె వివరించారు. ఇంతటి భారీ బరువుతో పుట్టినప్పటికీ, తల్లీబిడ్డ క్షేమంగా ఉండటం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు.