వరదల్లో చిక్కుకున్న 30 మంది.. రాజ్ నాథ్ సింగ్‌కు బండి సంజయ్ ఫోన్

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరద ఉధృతికి సుమారు 30 మంది నీటిలో చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌ను సహాయక చర్యల కోసం రంగంలోకి దించుతున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న వరద తీవ్రతను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన రాజ్ నాథ్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వరద నీటిలో చిక్కుకున్న 30 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణమే వైమానిక దళ హెలికాప్టర్‌ను పంపాలని కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై రక్షణ మంత్రి వెంటనే సానుకూలంగా స్పందించారు.

రాజ్ నాథ్ సింగ్ ఆదేశాల మేరకు, రక్షణ మంత్రి కార్యాలయం హకీంపేటలోని వైమానిక దళ అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌ను సిద్ధం చేసి, వరద ప్రభావిత ప్రాంతాలకు పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇదే సమయంలో, వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *