అలా చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుంది: సుప్రీంకోర్టు

V. Sai Krishna Reddy
1 Min Read

దేశంలోని పలు హైకోర్టులు తీర్పులు వెలువరించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ ముగిసి, తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత నెలలు, సంవత్సరాల తరబడి వెలువరించకపోవడం న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జాప్యాన్ని నివారించేందుకు అత్యున్నత న్యాయస్థానం కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై ఏదైనా కేసులో తీర్పును రిజర్వ్ చేసిన మూడు నెలల్లోగా వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ గడువులోగా తీర్పు రాకపోతే, సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆ విషయాన్ని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించింది. అప్పుడు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని, సంబంధిత బెంచ్‌ను రెండు వారాల్లోగా తీర్పు ఇవ్వాలని కోరాలని సూచించింది. ఆ గడువులోగా కూడా తీర్పు రాకపోతే, ఆ కేసును విచారణ కోసం మరో బెంచ్‌కు బదిలీ చేయాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

అలహాబాద్ హైకోర్టులో 2008 నాటి ఒక క్రిమినల్ అప్పీల్‌కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ముగిసి ఏడాది కావస్తున్నా తీర్పు వెలువడకపోవడం “తీవ్ర దిగ్భ్రాంతికరం, ఆశ్చర్యకరం” అని ధర్మాసనం పేర్కొంది. చాలా హైకోర్టులలో తీర్పుల జాప్యంపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలకు సరైన యంత్రాంగం లేకపోవడం కూడా సమస్యను తీవ్రతరం చేస్తోందని అభిప్రాయపడింది.

ప్రతి నెలా రిజర్వ్‌లో ఉండి, తీర్పు వెలువడని కేసుల జాబితాను రిజిస్ట్రార్ జనరల్స్ తప్పనిసరిగా చీఫ్ జస్టిస్‌కు అందించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. తమ తీర్పు ప్రతిని దేశంలోని అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌కు పంపి, ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *