భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) 2025 సంవత్సరానికి భారీ ఉద్యోగాల భర్తీ ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 491 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ను LIC అధికారికంగా విడుదల చేసింది. ఇందులో 81 అసిస్టెంట్ ఇంజినీర్లు (AE), 410 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (AAO) పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16, 2025 నుండి ప్రారంభమవుతుండగా, సెప్టెంబర్ 8, 2025 వరకు అభ్యర్థులు LIC అధికారిక వెబ్సైట్ licindia.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు, వయస్సు పరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, B.Tech/B.E, LLB, CA లేదా ICSI లాంటి అర్హతలు కలిగి ఉండాలి. వయస్సు పరిమితి విషయానికి వస్తే, కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నియమావళి ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల ఆన్లైన్ పరీక్షల ద్వారా జరుగుతుంది. మొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామ్, అనంతరం మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించబడతాయి. ప్రిలిమ్స్కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షకు 7 రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
SC/ST/PwBD కేటగిరీలకు దరఖాస్తు ఫీజు రూ.85 + GST, ఇతర అభ్యర్థులకు రూ.700 + GST ఉంటుంది. అదనంగా ట్రాన్సాక్షన్ ఛార్జీలు వర్తిస్తాయి.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన వేతనాలు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్లు మరియు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు ప్రాథమిక జీతం రూ.88,635గా నిర్ణయించబడింది. ఇది అనుభవం మరియు ప్రమోషన్ల ఆధారంగా గరిష్టంగా రూ.1,69,025 వరకు పెరిగే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తిగా నోటిఫికేషన్ను చదివిన తరువాతే licindia.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని LIC సూచిస్తోంది.