దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అలాగే ఈ రాత్రి వెలువడనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై నెలకొన్న ఆందోళనలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలను చవిచూశాయి. అయితే, ఫైనాన్షియల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు భారీ పతనం నుంచి కొంతమేర కోలుకున్నాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 138 పాయింట్లు నష్టపోయి 81,444 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 24,812 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 షేర్లలో టీసీఎస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడి, మార్కెట్లకు కొంత అండగా నిలిచాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో, బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 76 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బంగారం ఔన్సు ధర 3397 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 86.48గా ఉంది.