లాజిక్’ మిస్ అవుతున్న రాజ‌కీయ పార్టీలు

V. Sai Krishna Reddy
3 Min Read

రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా మూడు ప్రాంతీయ పార్టీలు, రెండు జాతీయ పార్టీలకు తోడు కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ రాజకీయ పార్టీలు లాజిక్ ను మిస్ అవుతున్నాయి అనే చర్చ నడుస్తుంది. అంటే ఏ సమయంలో స్పందించాలి? ఏ విషయంపై స్పందించాలి? ఎలా స్పందించాలి? అనే విషయంలో రాజకీయ నాయకులు, పార్టీలు కూడా తడబడుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ‌ నడుస్తోంది. ప్రధానంగా ఈ విషయం చర్చ‌కి వచ్చినప్పుడు అధికారంలో ఉన్న పార్టీలపై ఎక్కువగా దృష్టి ఉంటుంది.

ఈ పరంగా చూసుకుంటే టిడిపిలో కొంతమంది నాయకులు లాజిక్ మిస్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఏదో తమను వేధించారు కాబట్టి ఇప్పుడు కూడా వేధింపులకు గురి చేయాలి అన్న ఆలోచనతో కొందరు ఉంటే, మరికొందరు ఐదేళ్ల పాటు తమను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు తాము కూడా అదే పంథాలో వెళ్లాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇప్పటికే చాలామంది నాయకులు ఇటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా చంద్రబాబు పక్కన పెట్టారు. తాజాగా కొమ్మినేని విషయంలో లాజిక్ లేకుండా పెట్టిన కేసు కారణంగా అది సుప్రీంకోర్టులో వీగిపోవడం తదనంతర పరిణామాలు ప్రభుత్వానికి ఒకరకంగా ఇబ్బంది కలిగించాయి.

ఇది లాజిక్ లేని రాజకీయానికి పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఇక, జనసేన విషయానికి వస్తే అవసరమైన సందర్భంలో అసలు స్పందించకపోవడం అవసరం లేని విషయాలపై ఎక్కువగా స్పందించడం వంటివి జనసేన రాజకీయాల్లో లాజిక్ ను మిస్ చేస్తుంది. వైసీపీ విషయానికి వస్తే ప్రజల తరఫున పోరాడాల్సిన జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల తరఫున, అదే సమయంలో విద్రోహులుగా ముద్ర పడిన ఒకరిద్దరు వ్యక్తుల తరఫున ఆయన పోరాటాలు చేయటం అంత సమంజసంగా లేదనేది పబ్లిక్ చెబుతున్న మాట. అదేవిధంగా ఏ వేదికపై స్పందించాల్సిన విషయాన్ని ఆవేదికపైనే స్పందించాలి.

ఎక్కడ పోరాటం చేయాల్సిన విషయాన్ని అక్కడే పోరాటం చేయాలి. ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారనే వాదన బలంగా సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఇక‌, బీజేపీకి రాజకీయంగా ఒక లక్ష్యం లేదు. ఏదో కూట‌మిలో కొట్టుకొని వచ్చాం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బిజెపి ఎమ్మెల్యేలు ప్రజల మధ్య కనిపించడం లేదనేది స్పష్టంగా వినిపిస్తున్న మాట. అంతేకాదు కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లోనూ వారు పాల్గొనడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంలోను, వ్యక్తిగత రాజకీయాలు చేసుకోవడంలోను వారి పరిమితమైన కారణంగా వీళ్ళు కూడా ప్రజల తరఫున వ్యవహరించాల్సిన విషయంలో లాజిక్ ను మిస్ అయ్యారు అనేది పరిశీలకులు చెబుతున్న మాట

ఇక కాంగ్రెస్ విషయం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఎక్కువ మంచిది అన్న మాట ప్రజల్లోనే వినిపిస్తోంది. కనీసం రాజకీయ దిక్సూచి లేకుండా ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ చీఫ్ కూడా వ్యవహరిస్తున్నారనేది పరిశీలకులు అంటున్న మాటే. ఇక కమ్యూనిస్టులు ఉద్యమాలు వదిలేసి దశాబ్ద కాలం పైన అయిపోయింది. ఒకప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా రోడ్లమీదకి వచ్చిన ఎర్రజెండాలు ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు లాజిక్కును మిస్సయ్యాయనే చెప్పాలి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *