సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి, అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయవద్దని ధర్మాసనం ఆయనను గట్టిగా హెచ్చరించింది.
తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కొమ్మినేనిని విడుదల చేయాలని ఆదేశిస్తూ, ఆయన విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు, ప్రక్రియలను సంబంధిత ట్రయల్ కోర్టు చూసుకుంటుందని స్పష్టం చేసింది.