ఆ ఒక్క ప్రయాణికుడు ఎలా తప్పించుకున్నాడో తెలుసా?

V. Sai Krishna Reddy
2 Min Read

అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది మరణించగా, ఒక్క ప్రయాణికుడు మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాశ్ కుమార్ రమేశ్ తాను ఎలా రక్షించబడ్డాడో వివరించారు.

విశ్వాశ్ కుమార్ విమానంలో 11ఏ నంబర్ సీటులో ఎడమవైపున ఉన్న అత్యవసర ద్వారం పక్కన కూర్చున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గాల్లోనే ముక్కలైపోయిందని, తన సీటు విమానం నుంచి విడిపోయి దూరంగా ఎగిరిపడిందని ఆయన తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్ వైద్యులతో మాట్లాడుతూ “విమానం ముక్కలైంది, నా సీటు ఊడివచ్చింది. అలా నేను ప్రాణాలతో బయటపడ్డాను” అని చెప్పారు. విమానం ఛిద్రమైనప్పుడు తాను సీటు బెల్టుతో ఉండగానే బయటకు విసిరివేయబడ్డానని, అంతేగానీ తాను దూకలేదని ఆయన స్పష్టం చేశారు. గాయాలతో బయటపడ్డ ఆయన ప్రస్తుతం ట్రామా వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం సమీపంలోని ఒక వైద్య కళాశాల హాస్టల్‌పై కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విమానం టేకాఫ్ అయ్యాక కేవలం 600 నుంచి 800 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకుని, వెంటనే కిందకు కూలిపోయింది. కూలిపోయే ముందు విమానం నుంచి భారీగా మంటలు, దట్టమైన నల్లటి పొగలు ఎగిసిపడటం చాలా దూరం నుంచి కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ‘మేడే’ (అత్యవసర పరిస్థితి) సందేశాన్ని అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు పంపినట్టు తెలిసింది.

ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభమైంది. విమానం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి కీలకమైన బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఎయిర్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం మృతి చెందిన ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, ఏడుగురు పోర్చుగీస్ వారు, ఒక కెనడియన్ ఉన్నారు. మిగిలిన 12 మందిలో ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ రూపానీ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *