ఢిల్లీలో ఏం జరుగుతోంది..?

V. Sai Krishna Reddy
2 Min Read

ఇటీవల తెలంగాణ మంత్రివర్గంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రుల శాఖలపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే విషయంలో అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపేందుకు మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సడెన్‌గా నిన్నరాత్రి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు వంటి అంశాలు ప్రస్తుతం హట్‌టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఉత్తమ్, భట్టికి ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం.. వెంటనే వారు వెళ్లడం .. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేసే యోచనలో ఉన్న పార్టీ అధిష్ఠానం..ఆ విషయంపై చర్చించేందుకే ఉత్తమ్‌ కుమార్‌, భట్టి విక్రమార్కను ఢిల్లీ పిలిపించినట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది..? కొత్తమంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు అధిష్ఠానం నుండి మరో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందా అనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకుంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీతో రేవంత్‌ సమావేశం
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో కూడా సమావేశమయ్యారు. క్యాబినెట్‌ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ పెద్దలతో రేవంత్‌ చర్చలు జరిపినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. పలువురు మంత్రుల శాఖల్లో మార్పు, ఇతర అంశాలపై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం మంత్రుల దగ్గర ఉన్న శాఖలు, 18 నెలలుగా వారి పనితీరుపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖల సమాచారాన్ని ఇప్పటికే పార్టీ అధిష్ఠానంకు అందించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర హోం, ఎడ్యుకేషన్, మున్సిపల్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, లా, లేబర్, స్మోర్ట్స్, యువజన శాఖలు ఉన్నాయి. వీటిలో కొత్త వారికి పలు శాఖలు అప్పగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేయాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. అదే ఫైనల్‌ అయితే డిప్యూటీ సీఎం మొదలు కీలక మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండవచ్చని చెబుతున్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ల లిస్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం
ఇటీవల టీపీసీసీలో ఐదు కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ..తాజాగా 27మంది నేతలకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69మందికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించింది.ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ల లిస్ట్‌పై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆంశంపై కూడా రాష్ట్ర నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చిస్తారని తెలుస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *