జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్

V. Sai Krishna Reddy
1 Min Read

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అప్పటి మంత్రులను విచారించింది. తాజాగా, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో, గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.

ఈ క్రమంలో కమిషన్ బ్యారేజీ నిర్మాణ ఇంజినీర్లు, నీటి పారుదల శాఖ, ఆర్థిక శాఖలకు చెందిన అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించి, క్రాస్ ఎగ్జామినేషన్‌ను సైతం పూర్తి చేసింది. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్ రావులను కూడా కమిషన్ విచారించింది.

ఈరోజు ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించనుంది. ఇప్పటి వరకు మీడియా, కమిషన్‌లోని ఇంజినీర్ల సమక్షంలో విచారణ జరిపిన కమిషన్.. కేసీఆర్ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తుందా, లేక కేవలం కమిషన్ అధికారుల సమక్షంలోనే ఇన్ కెమెరా విచారణ జరుపుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *