ఆర్టీసీ బస్‌పాస్‌ చార్జీల పెంపు: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్‌భవన్‌ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బస్‌పాస్‌ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బస్‌భవన్‌ను ముట్టడించి, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కవితను చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బస్‌పాస్‌ ధరలు పెంచి సామాన్యులపై తీవ్రమైన భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఈ ధరల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు సుమారు 300 రూపాయలకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉంది” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడిపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా, విద్యార్థుల సౌకర్యార్థం అనేక మార్గాలలో తగినన్ని బస్సులు నడపడం లేదని తమ దృష్టికి ఫిర్యాదులు వస్తున్నాయని కవిత తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *