మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో జరిగిన ఎన్నికల అఫిడవిట్లో హరీష్ రావు తప్పుడు సమాచారాన్ని అందించి గెలుపొందారని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన హరీష్ రావుపై అనర్హత వేటు వేయాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు హరీష్ రావు ఎన్నికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టి వేసింది. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్కు సైరన ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు తెలుస్తోంది. కోర్టు తీర్పుపై హరీష్ రావు స్పందన..
కాగా.. హైకోర్టులో తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు వేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ కోర్టు బుద్ది చెప్పిందని ఆయన అన్నారు. న్యాయస్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆయన విమర్శించారు. మొన్నటి ఫోన్ టాపింగ్ కేసైనా, ఇప్పుడు ఎన్నిక చెల్లదనే కేసు అయినా దురుద్దేశపూర్వకంగా పెట్టిందేనని ఆయన చెప్పుకొచ్చారు.
తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని..ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. అధికార పార్టీ ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సాధించాలని హరీష్ రావు వ్యాఖ్యానించారు. వారు పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని. తాము ప్రజల తరఫున ఎప్పుడూ అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.