అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి కొనసాగుతోంది. యువ కథానాయకుడు అక్కినేని అఖిల్, జైనాబ్ల వివాహ రిసెప్షన్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై అఖిల్, జైనాబ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు మహేశ్బాబు తన అర్ధాంగి నమత్రతో కలిసి విచ్చేయగా, తమిళ స్టార్ హీరో సూర్య, యువ దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు కూడా ఈ వేడుకలో పాలుపంచుకుని నవ దంపతులకు తమ ఆశీస్సులు అందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన, నాని, నిఖిల్, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు సానా తదితరులు కూడా విచ్చేశారు.
వీరితో పాటు మరికొంతమంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఈ వివాహ విందులో పాల్గొని సందడి చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణం ప్రముఖుల రాకతో కళకళలాడింది. అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అఖిల్, జైనబ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఆకర్షణీయమైన ఫోటోలను అన్నపూర్ణ స్టూడియోస్ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోగా, అవి ప్రస్తుతం ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
ఈ నెల 6వ తేదీన, శుక్రవారం నాడు, అఖిల్, జైనాబ్ల వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నాగార్జున నివాసంలో నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహానంతరం ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్ వేడుకకు పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు