ఏపీ సచివాలయంలో ఉద్యోగాలంటూ ఘరానా మోసం

V. Sai Krishna Reddy
2 Min Read

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, ఏడుగురు నిరుద్యోగ యువకుల నుంచి ఏకంగా రూ.53 లక్షలు కొల్లగొట్టిన ఓ మోసపూరిత ముఠా గుట్టును విజయనగరం పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు నేడు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఫేస్‌బుక్‌లో ప్రకటనతో మొదలైన మోసం

విజయనగరం పట్టణంలోని ప్రదీప్ నగర్‌కు చెందిన కె. సాయి వెంకట్ సుజిత్ అనే వ్యక్తి ఈ మోసానికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఆసక్తి కలిగిన వారు తనను సంప్రదించాలంటూ సుజిత్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టాడు. ఈ ప్రకటన చూసిన విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు సుజిత్‌ను సంప్రదించారు. విజయవాడలోని సచివాలయంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు కచ్చితంగా ఇప్పిస్తానని వారిని నమ్మించాడు. ఈ క్రమంలో వారి నుంచి విడతలవారీగా మొత్తం రూ.53 లక్షలు వసూలు చేశాడు. అనంతరం, వారికి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించి అందజేశాడు.

బాధితులను నమ్మించేందుకు, ఈ ముఠా సభ్యులు ఏడుగురు యువకులను విజయవాడకు తీసుకువెళ్లి, అక్కడ నెల రోజుల పాటు ఉంచారు. త్వరలోనే ఉద్యోగంలో చేరే సమాచారం వస్తుందని చెప్పి వారిని వెనక్కి పంపించేశారు. అయితే, ఎంతకాలం ఎదురుచూసినా ఎలాంటి సమాచారం రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులలో ఒకరైన ఎస్.కోటకు చెందిన ఎస్. వినోద్, విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐ ఎస్. శ్రీనివాస్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.

పక్కా సమాచారంతో నిందితుల అరెస్ట్

పోలీసుల విచారణలో ఈ ముఠాలో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు తేలింది. వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా, నలుగురు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. తమపై కేసు నమోదైందని తెలియగానే నిందితులు పరారయ్యారు. అయితే, ముఠాలో కీలక నిందితుడైన సాయి వెంకట్ సుజిత్‌కు అనారోగ్యంగా ఉందని, అతడిని చూసేందుకు మిగిలిన నిందితుల్లో కొందరు సీహెచ్ మహేష్, రూబిన్ కుమార్, జాన్, యాకూబ్ విజయనగరం వస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.

ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు, విజయనగరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాటువేసి, చాకచక్యంగా వ్యవహరించి ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లను హైదరాబాద్‌లో తయారు చేసినట్లు వారు వెల్లడించారు.

ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ప్రధాన నిందితుడు సుజిత్‌ కోలుకున్న వెంటనే అరెస్టు చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్నకుమార్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నిరుద్యోగులు ఇలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఉద్యోగాల పేరిట డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *