తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు, నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగురవేసి, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొని జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని వెల్లడించారు. ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాలను ఎగురవేసి సంబరాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కేంద్రాలతో పాటు అన్ని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లోనూ జాతీయ పతాకాన్ని, గులాబీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ అవతరణ సంబరాలను ప్రజలతో కలిసి జరుపుకోవాలని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “14 ఏళ్ల అలుపెరగని పోరాటం, ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలి” అని తెలిపారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారమైందని ఆయన గుర్తు చేశారు.
“కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా దిక్సూచిగా నిలిచింది” అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభాల్లా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకూ గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులంతా ఈ వేడుకల్లో పాల్గొని, ప్రజలతో కలిసి అవతరణ వేడుకలను విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు.