ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) అయ్యన్నపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎస్. శ్రీనివాసరావు సస్పెన్షన్ వేటు వేశారు. సీఎస్ఓగా ఉద్యోగ బాధ్యతల పట్ల అయ్యన్న నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఈవో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే, సుమారు పది రోజుల క్రితం, ఇతర మతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆలయ సందర్శన కోసం వచ్చారని తెలిసింది. ఆ సమయంలో వారి వద్ద అన్యమతానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నట్లు క్యూ లైన్ల వద్ద భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో సిబ్బంది వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతర మతస్థులు శ్రీశైలంలో కలకలం సృష్టించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, భద్రతాపరమైన అంశాల్లో సీఎస్ఓ అయ్యన్న నిర్లక్ష్యంగా ఉన్నారని భావించిన ఈవో శ్రీనివాసరావు, ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరిపే అవకాశం ఉంది.