మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. రూపం మార్చుకుని అటాక్

V. Sai Krishna Reddy
2 Min Read

కరోనా మళ్లీ విజృంభించబోతోందా…? పాత శత్రువు కొత్త రూపం సంతరించుకుందా..? ఈ సారి వస్తే…అంత ఈజీగా వదలదా.? 2019నాటి లాక్‌డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా..?… అంటే అవుననే సమాధానం వస్తోంది వైద్యనిపుణుల నుంచి. ఈసారి వచ్చేది మామూలు కరోనా వేరియంట్ కాదని…దానితో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలూ వస్తున్నాయి. ఇప్పటికే మన పక్కదేశాలను కరోనా వైరస్ కమ్మేసింది. ఇక ప్రపంచాన్ని కుదిపేసుందుకు రెడీ అవుతోందన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్‌లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి. వేసవి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండటం మరింత కలవరం పెడుతోంది. హాంకాంగ్‌లో కోవిడ్-పాజిటివ్ కేసుల శాతం రోజురోజుకూ పెరుగుతోంది. మే 3 నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్యశాఖ ప్రకటించింది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా, వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు.

సింగపూర్‌లో కూడా.. ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మే 3 నుంచి వారంలో కొత్త కేసుల సంఖ్య అంతకు ముందు ఏడు రోజులతో పోలిస్తే 28 శాతం పెరిగి 14వేల200కు చేరుకుంది. రోజువారీ ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 30 శాతం పెరిగింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక చైనా విషయానికి వస్తే.. అక్కడి అధికారులు కూడా కోవిడ్ కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతోంది. మే 4 వరకు ఉన్న ఐదు వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం సార్స్ కొవిడ్-2 పాజిటివిటీ రేటు 7.3% నుండి 5.0%కి తగ్గినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ కొత్త వేరియంట్ JN.1, వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్..VOI గా వర్గీకరించబడింది, 2025లో 16.3% సీక్వెన్స్‌లలో కనిపించిందీ వైరస్. అలాగే, LP.8.1, LB.1 వంటి వేరియంట్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి.

ఇక మన దేశంలో కూడా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. హాస్పిటల్ అడ్మిషన్లు, ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారిలో కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన “హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025” నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించిన తర్వాత, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్టు తేలింది. ఈ పరిస్థితి జనంలో భయాందోళనలను మరింత పెంచింది. సో..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *