సుమారు 21 రోజుల పాటు సాగిన కర్రెగుట్ట ఆపరేషన్
కీలక ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. ఉసురు పోలీస్స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా చేపట్టిన ఆపరేషన్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్లు సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్దేవ్ గౌతం ప్రకటించారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను బుధవారం బీజాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు.
సుమారు 21 రోజుల పాటు సాగిన ఈ కీలక ఆపరేషన్లో మృతి చెందిన 31 మంది మావోయిస్టులలో 16 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. హతమైన మావోయిస్టులపై ప్రభుత్వం గతంలో మొత్తం రూ.1.72 కోట్ల రివార్డును ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పులు, ఆపరేషన్ క్రమంలో 18 మంది భద్రతా సిబ్బంది గాయపడినట్లు వెల్లడించారు. మరణించిన మావోయిస్టులలో ఇప్పటివరకు 20 మందిని గుర్తించామని, మరో 11 మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఘటనా స్థలం నుంచి 35 అత్యాధునిక ఆయుధాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ప్రారంభమైన కర్రెగుట్ట ఆపరేషన్ మే 11వ తేదీ వరకు కొనసాగిందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 174 మంది కరడుగట్టిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.