భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్కు సంబంధించిన సమగ్ర వివరాలను సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి సమర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, కట్టుదిట్టమైన చర్యలను ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు.
ఈ భేటీపై రాష్ట్రపతి భవన్ ట్వీట్
“రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాల అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావికా దళాల అధిపతి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. ఉగ్రవాదంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల శౌర్యం, అంకితభావాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు” అని రాష్ట్రపతి భవన్ తన ట్వీట్లో పేర్కొంది.