ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన వేదికపైనే ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. కూవాగం గ్రామంలో ప్రసిద్ధి చెందిన కూత్తాండవర్ ఆలయ చిత్తిరై (తమిళ మాసం) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్ల కోసం ‘మిస్ కూవాగం 2025’ అందాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్న విశాల్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందకు పడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన నిర్వాహకులు, అభిమానులు వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. దీంతో కొద్దిసేపటికే విశాల్ తేరుకున్నారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం అక్కడే ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి పొన్ముడి, విశాల్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అభిమానుల్లో ఆందోళన
ఇటీవల కాలంలో విశాల్ ఆరోగ్యంపై పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన నటించిన ‘మద గజ రాజా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో విశాల్ కాస్త నీరసంగా కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ ఊహాగానాలను అప్పట్లో విశాల్ బృందం ఖండించింది. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే నీరసంగా కనిపించారని స్పష్టం చేసింది. తాజా ఘటనతో విశాల్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.