ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025 గురువారం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఈవెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు నాలుగు రోజుల పాటు సాగనుంది.
అయితే, ఈ సదస్సులో ఏర్పాటు చేసిన రామోజీ ఫిల్మ్సిటీ స్టాల్ స్పెషల్ అట్రాక్షన్గా అందరి దృష్టిని ఆకర్షించింది. వేవ్స్ సదస్సులో ఫిల్మ్సిటీ స్టాలుకు వస్తున్న ప్రతినిధులు, సందర్శకులతో సీఎండీ సీహెచ్ కిరణ్ స్వయంగా వివరాలు చెబుతున్నారు. ఈటీవీ సీఈఓ కే బాపినీడు, ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షులు ఏవీ రావు, కే రవీంద్రరావు ఆయనతోపాటు ఉన్నారు.
ఇక, రామోజీ ఫిల్మ్సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్సిటీగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇప్పటివరకు 3,500పైగా చిత్రాలు నిర్మాణాలు జరుపుకోవడం విశేషం. పాన్ ఇండియా సినిమాలుగా ఆదరణ పొందిన ఆర్ఆర్ఆర్, బహుబలి, కల్కి, పుష్ప వంటివి ఇక్కడ రూపొందినవే.
కాగా, అంతర్జాతీయ స్థాయిలో భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్రం ‘వేవ్స్’ కార్యక్రమానికి నాంది పలికింది. ఇది మీడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే అద్భుత వేదిక. ఈ కార్యక్రమంలో గురువారం మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, అల్లు అర్జున్, నాగచైతన్య, శోభిత తదితర టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.