కశ్మీర్లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి తర్వాత ఇరు అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.
గత వారం ఏప్రిల్ 22న కశ్మీర్లో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పౌరులపై జరిగిన ఈ దారుణ ఘటనపై భారత్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ ఆరోపిస్తుండగా, ఇస్లామాబాద్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.
సోమవారం నాడు ఇస్లామాబాద్లోని తన కార్యాలయంలో రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ, “భారత్ నుంచి దాడి జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే మేము మా బలగాలను పటిష్టం చేశాం. ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ నిర్ణయాలు తీసుకున్నాం” అని తెలిపారు. భారత దాడికి అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, అయితే దాడి ఎందుకు జరగనుందనే దానిపై మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు.
పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ దేశ ఉనికికి ప్రత్యక్షంగా ముప్పు ఏర్పడితే తప్ప అణ్వాయుధాలను ఉపయోగించబోమని ఆసిఫ్ స్పష్టం చేశారు.