వైఎస్ భారతి ప్రాణాలకు ముప్పు : ఆందోళనలో వైసీపీ!

V. Sai Krishna Reddy
2 Min Read

మాజీ సీఎం వైఎస్ భారతి ప్రాణాలకు ప్రమాదం పొంచివుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఓ పథకం ప్రకారం సోషల్ మీడియాలో భారతికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం వల్ల ఆమెకు హాని ఉందని భయపడుతోంది. మాజీ సీఎం భార్యకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు.

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలతో వైసీపీ అప్రమత్తమైంది. కిరణ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించి, అతడిని అరెస్టు చేయించినా, గత కొంతకాలంగా భారతికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం వల్ల ఆమెకు ముప్పు పొంచివుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఆమెకు 2 ప్లస్ 2 గన్ మెన్ భద్రత కల్పించాలని హైకోర్టును కోరేందుకు సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా కార్యకర్తలు అందరిపైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ సీనియర్ నేత, లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది నేతలు భారతి కోసం న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఐటీడీపీ కార్యకర్త కిరణ్ వ్యాఖ్యల నేపథ్యంలో తాడేపల్లి పేలస్ లో ఈ అంశంపై చాలా పెద్ద చర్చ జరిగిందని అంటున్నారు. కిరణ్ వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయని భావిస్తున్న వైసీపీ నేతలు, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని కోరుతూ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా మాజీ సీఎం జగన్ భార్య భారతిపై నీచంగా మాట్లాడిన వారిని వదిలిపెట్టకూడదని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, అవి తూతూమంత్రంగా భావిస్తున్న వైసీపీ నేతలు న్యాయ పోరాటం ద్వారా నిష్పాక్షిక విచారణ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తునేది ఆసక్తికరంగా మారింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *