రాజంపేట మండలంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి
రాజంపేట, మార్చి 30 (ప్రజా జ్యోతి)
రాజంపేట మండలంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను గ్రామీణ ప్రజలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మామిడి ఆకుల తోరణాలతో గృహాలను అలంకరించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీపి వంటకాలు సిద్ధం చేసుకుని, ఆలయాల వద్ద పూజలు జరిపిన అనంతరం, గ్రామ కూడళ్ల వద్ద, హనుమాన్ ఆలయాల వద్ద వేద పండితులతో పంచాంగ శ్రవణం వినిపించారు. తమ తమ రాశులవారీగా పంచాంగ శ్రవణం విని, ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని—తీపి, చేదు, ఓగరు, కారం, పులుపు, ఉప్పు—పెద్దల చేతుల మీదుగా తీసుకొని ఆరగించారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఆలయాల చుట్టూ ఎడ్ల బండ్లతో ప్రదక్షిణలు నిర్వహించి, సంప్రదాయ ఉత్సాహాన్ని చాటారు. మండల కేంద్రంలో పెద్దమ్మ, ఎల్లమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ వంటి దేవతలకు కులాలకతీతంగా ప్రత్యేక పూజలు జరిపి, ఎడ్ల బండ్ల ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు.మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ రఘురాం, ఎస్సై పుష్పరాజ్, మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ఈ నూతన సంవత్సరంలో సరికొత్త పనులు ప్రారంభించి, ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, ఉగాది సంబరాలను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకలు మండల ప్రజల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి.