లోక్ సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణపై తమిళనాడు నిర్వహించే భేటీకి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వెల్లడించారు. డీలిమిటేషన్పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీకి సీపీఐ, సీపీఎం, మజ్లిస్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ గైర్హాజరైంది.
సమావేశం ముగిసిన అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై మరిన్ని సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే సభకు అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరు సమావేశానికి వెళతారని అన్నారు. కొన్ని పార్టీల గైర్హాజరు తాత్కాలికమేనని, భవిష్యత్తులో అందరూ వస్తారని ఆయన అన్నారు.