- నర్సాపూర్లో కిటకిటలాడిన పండ్ల విక్రయశాలలు
• సాధారణం కంటే రూ. 20 అదనంగా వసూలు..!
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణ కేంద్రం వినియోగదారులు, భక్తులతో కిటకిటలాడింది. శివయ్య అనుగ్రహం కోసం భక్తులందరూ భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టడంతో, పట్టణంలోని పండ్ల దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. అయితే, ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు ధరలను అమాంతం పెంచేసి సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. సాధారణ రోజుల్లో ఉండే ధరల కంటే, నేడు ప్రతి వస్తువుపై సుమారు రూ. 20 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. పండ్లు, దుంపల ధరలు చుక్కలనంటుతున్నాయి. పండుగ పూట తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు అధిక ధరలు చెల్లించి వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది.
