మస్క్ టాప్-10 దేశాల్లో భారత్ కు రెండో స్థానం

V. Sai Krishna Reddy
1 Min Read

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదుపులకు గురవుతున్న వేళ, సంక్షోభంలో ఉన్న గ్లోబల్ ఎకానమీకి చైనా, భారత్‌లు కీలక చోదక శక్తులుగా మారాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ప్రపంచంలో ఆర్థిక శక్తి క్రమంగా చైనా, భారత్ చేతుల్లోకి వెళుతోందని వ్యాఖ్యానించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్న టాప్‌ -10 దేశాల జాబితాను మస్క్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఐఎమ్ఎఫ్ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, ప్రపంచ జీడీపీలో 26.6 శాతం వాటాతో చైనా తొలి స్థానంలో నిలిచింది. 17 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉండగా, కేవలం 9.9 శాతం వాటాతో అమెరికా మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తంగా చూస్తే చైనా, భారత్‌లు కలిపి ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 43.6 శాతం వాటాను కలిగి ఉంది. ఈ గణాంకాలను ప్రస్తావించిన మస్క్.. ప్రపంచంలో పవర్ చేతులు మారుతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ఇక ఐఎమ్ఎఫ్ అంచనాల ప్రకారం 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతంగా, 2027లో 3.2 శాతంగా ఉండనుంది. ఆధునిక సాంకేతికతలపై పెట్టుబడులు, ప్రభుత్వాల విత్త, ద్రవ్యపరపతి విధానాల మద్దతు, బలమైన ప్రైవేటు రంగం గ్లోబల్ ఎకానమీకి ఊతమిస్తున్నాయని ఐఎమ్ఎఫ్ తెలిపింది. ట్రంప్ విధించిన సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇవి అనేక దేశాలకు కీలకంగా మారాయని పేర్కొంది.

భారత్ విషయానికొస్తే, 2025 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్న ఐఎమ్ఎఫ్, ఈ ఏడాది, వచ్చే ఏడాది వృద్ధి రేటు 6.4 శాతంగా ఉండొచ్చని వెల్లడించింది. చైనాలో ద్రవ్యోల్బణం కొంత పెరిగే అవకాశముండగా, భారత్‌లో మాత్రం ప్రభుత్వ అంచనాల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *