- పునరావాస కేంద్రాలకు తరలింపులో ‘జీపివో’ ల కీలక పాత్ర
- హనుమకొండ లో వరద బాధితులను ఆదుకున్న రెవెన్యూ సిబ్బంది
- గోపాలపూర్ ‘జీపివో’ ను అభినందించిన బాధితులు
వరంగల్, అక్టోబర్ 30 (ప్రజాజ్యోతి):
వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించటంలో ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ శాఖలో నూతనంగా నియమించిన గ్రామ పాలనాధికారులు కీలక పాత్ర పోషించారు. హనుమకొండ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. ఆపత్కాల పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ సిబ్బంది ముందుకు వచ్చి వరద బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. హనుమకొండ గోపాలపూర్ చెరువు గండి పడింది. దీంతో ముంపు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గ్రామ పాలనాధికారులు విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఉదయం నుండి ముంపు ప్రాంతాల వివరాలు ఉన్నతధికారులకు తెలియపరుస్తూ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. మరో వైపు పిల్లలు వృద్ధులు తిండి కోసం అల్లాడి పోతుంటే గోపాలపూర్ జీపివో శోభారాణి తన స్వంత ఖర్చులతో ఉదయం టిఫిన్, బ్రేడ్ పాకెట్స్, వాటర్ బాటిల్స్ అందించి తన ఉదార స్వభావాన్నీ చాటుకున్నారు. సాయంత్రం ఉన్నతాధికారుల నుండి అందిన పులిహోర పాకెట్స్ బాధితులకు అందచేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఎన్ఎస్ఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వివేకానంద కాలనిలో మమత అనే మహిళా పురిటి నొప్పులతో బాధపడుతుంటే జీపివో శోభా రాణి ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు తెలియ పరిచి డెలివరీ నిమిత్తం హాస్పిటల్ తరలించేందుకు సహకరించింది. రెవెన్యూ సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసి పలు కుటుంబాలను రక్షించారు. తాత్కాలిక ఆశ్రయ శిబిరాల్లో ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలను అందజేశారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో అధికారులు ప్రతి కాలనీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో ఉన్నవారిని వెంటనే తరలించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉంచారు. రెవెన్యూ సిబ్బంది చేసిన ఈ సేవలను ప్రజలు అభినందిస్తున్నారు. “మేము నిరాశ్రయులమవుతామనుకున్నాం, కానీ అధికారులు సమయానికి చేరుకుని మాకు భరోసా ఇచ్చారు” అని బాధితులు తెలిపారు.

